Pawan Kalyan: ఇక్కడ మీ అన్న పవన్ కల్యాణ్ ఉన్నాడు... వాడు ఉండగా మీకు కష్టం ఏంటి?: పవన్ కల్యాణ్

  • విశాఖ జిల్లా పెందుర్తిలో వారాహి విజయభేరి సభ
  • ప్రభుత్వాన్ని తీసుకెళ్లి తుంగలో తొక్కాలన్న పవన్
  • జగన్ ను గద్దె దింపి, కూటమిని ప్రభుత్వంలోకి తీసుకురావాలని పిలుపు
  • తనపై ఎర్ర కండువాలు విసిరితే ప్రయోజనం లేదన్న జనసేనాని
  • నిలబడి పోరాడితేనే న్యాయం జరుగుతుందని స్పష్టీకరణ
Pawan Kalyan says he will stand for everyone as a brother

విశాఖ జిల్లా పెందుర్తి వారాహి విజయభేరి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ప్రభుత్వాన్ని మార్చండి... తీసుకెళ్లి తుంగలో తొక్కండి అని పిలుపునిచ్చారు. మార్చుదాం... సంకల్పిద్దాం... బలమైన భవిష్యత్తును నిర్మించుకుందాం అని పేర్కొన్నారు. 

అంతకుముందు ఆయన తన ప్రసంగంలో వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఏ మూలకు వెళ్లినా భూ కబ్జా బాధితులు కనిపిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం మూడు కబ్జాలు, ఆరు సెటిల్మెంట్లతో ఉందని విమర్శించారు. దీనిపై మాట్లాడాల్సింది, చొక్కా పట్టి నిలదీయాల్సింది ప్రజలేనని, ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడితేనే మార్పు తథ్యం అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అంతేతప్ప, తాను ప్రసంగిస్తుంటే ఎరుపు కండువాలు విసిరితే ప్రయోజనం లేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

"ఒక సమస్యపై ధైర్యంగా నిలబడాలి, తిరగబడాలి... మీకు జగన్ ఉద్యోగాలు ఇవ్వలేదు, ఫీజు రీయింబర్స్ మెంట్ చేయలేదు, ఉపాధి అవకాశాలు కల్పించలేదు... అతడికి ఓటేస్తారా? మరి ఏం చేద్దాం... జగన్ ను గద్దె దించుదాం, మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం. 

పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నాడా, లేదా? పరిశ్రమల్లో యువత ఉపాధి పొందేందుకు అవసరమైన స్కిల్ డెవలప్ మెంట్ కు చర్యలు తీసుకున్నాడా? ఓట్లేయించుకుని రూ.5 వేల జీతంతో వాలంటీరు ఉద్యోగాలిస్తే సరిపోతుందా? ఇలాంటి వాళ్లకు మీరు ఓట్లేస్తారా? 

ఇక్కడ పెందుర్తి నుంచి జనసేన అసెంబ్లీ అభ్యర్థి పంచకర్ల రమేశ్ బాబు, అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేశ్ పోటీ చేస్తున్నారు. వారిద్దరికీ మీ విలువైన ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించండి. 

ఇవాళ మీరు అడగొచ్చు... అన్నా మీరు ఫలానా వారికి ఓటేయాలని చెబుతున్నారు... ఓటు వేసిన తర్వాత పనులు చేయకపోతే ఎట్లా అంటే... మీ అన్న పవన్ కల్యాణ్ ఉన్నాడు... వాడు ఉండగా మీకు కష్టం ఏంటి? నేనున్నాను కదా... నేను పని చేస్తా, ఈ ఇద్దరితో పని చేయిస్తా. ఈ మేరకు హామీ ఇస్తున్నా. నేను పారిపోను. కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడవని అధికారం ఎందుకు?" అంటూ పవన్ పేర్కొన్నారు.

More Telugu News